తల్లిని చేస్తే.. ఫ్లాట్ రాసిస్తా: టెక్కీ సవాల్



తనకు సంతాన భాగ్యం కల్పిస్తే.. బెంగళూరు నగరంలోని తన ఫ్లాట్‌ను రాసిస్తా అంటూ ఓ మహిళ తన భర్తకు సవాల్ విసిరింది. ఇంతకూ ఆమె అంతలా విసిగిపోవడానికి కారణం ఏంటి? మరీ ఇంతలా సవాల్ విసరాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? వివరాల్లోకి వెళ్తే.. ఓ మల్టీ నేషనల్ కంపెనీలో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేసే కునాల్, ప్రియ (పేరు మార్చాం) ఒకరినొకరు ఇష్టపడ్డారు. చాలా కాలం ప్రేమలో మునిగి తేలిన తర్వాత వన్ ఫైన్ డే పెళ్లాడారు. తొలి రాత్రి వేళ.. తన భర్త కౌగిలిలో ఒదిగిపోవాలని ఆ నవ వధువు ఎన్నో కలలు కన్నది. కానీ ఆ రాత్రి కునాల్ ఆమెను దూరంగా పెట్టాడు. విశ్రాంతి లేకపోవడం వల్ల అలా ఉన్నాడేమో అనుకుని ప్రియ తనకు తాను సర్ది చెప్పుకుంది. అలా వారాలు, నెలలు కాదు ఏళ్లు గడిచాయి. ఆరేళ్ల నుంచి రాత్రయితే దూరంగా పడుకోవడమే.

కునాల్ తీరు పట్ల విసిగిపోయిన సదరు భార్యామణి.. ఇక లాభం లేదనుకొని భర్తను గట్టిగా నిలదీసింది. బదులిచ్చేదాకా వదిలిపెట్టలేదు. ఇక తప్పదని భావించిన కునాల్.. తను నపుంసకుడినంటూ అసలు విషయం బయటపెట్టాడు. చిర్రెత్తుకొచ్చిన ఆ మహిళ వెంటనే హల్సూరులోని మహిళా పోలీస్ స్టేషన్‌కెళ్లి ఫిర్యాదు చేసింది. ఆ విషయం చెప్పిన నాటి నుంచి భర్త జాడ లేదంటూ వాపోయింది. అంతే కాకుండా అత్తమామలు, ఆడపడుచులు వేధిస్తున్నారంటూ తన గోడు వెళ్లబోసుకుంది.
ఇప్పటికైనా సరే.. తన భర్త తిరిగొచ్చి సంతాన భాగ్యం కలిగిస్తే తన పేరు మీదున్న ఫ్లాట్ అతడికే రాసిస్తానంటోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్తను వెతికే పనిలో ఉన్నారు. మరి ఆమె భర్త తిరిగొస్తాడో. ఆ భార్య కోరిక నెరవేరుతుందా?

No comments

Powered by Blogger.